మైండ్ గేమ్ మాయలేడి !
- ప్రియుడిని చంపి.. భర్త “ఆధార్” ఆధారాలుగా వదిలి..
- పోలీసుల కళ్ళు కప్పేందుకు యత్నం
- తీగలాగి డొంకను కదిలించిన గుంటూరు అర్బన్ పోలీసులు
- కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ అమ్మిరెడ్డి
గుంటూరు: అక్రమ సంబంధాలు ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ మహిళ
ఒక దెబ్బకు రెండు పిట్టలాట ఆడింది. ఒక ప్రియుడిని చంపేసి, మరొక ప్రియుడిని ఇరకాటంలోకి నెట్టింది. ప్రియుడి హత్యకు కారణమైన మహిళ, సహకరించిన మరో ముగ్గురిని గుంటూరు అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి తన కార్యాలయంలో సోమవారం మీడియాకి వెల్లడించారు.
పిడుగురాళ్ళ మండలం గుత్తికొండ గ్రామానికి చెందిన పఠాన్ నాగుర్ బీ, భర్త గాలిసైదాతో మనస్పర్థలొచ్చి తన పిల్లలతో గుంటూరు శ్రీనివాసరావుతోటలో నివాసం ఉంటుంది. అయితే గుత్తికొండలో ఉన్న సమయంలోనే మోదుగుల పూర్ణచంద్రరావు అనే వ్యక్తితో అక్రమబంధాన్ని కొనసాగించిన నాగుర్ బీ గుంటూరు మకాం మార్చినా కూడా అతనితో సంబంధాన్ని కొనసాగించింది. ఆ తర్వాత నాగుర్ బీ హోటల్ నడుపుకుంటూ షఫీ అనే వ్యక్తిని పెళ్ళిచేసుకుంది. అంతేకాకుండా.. స్థానికంగా చీటీలు వేస్తూ గుత్తికొండకు చెందిన ప్రియుడు పూర్ణచంద్రరావుని కూడా చీటీల్లో సభ్యుడిగా చేర్చుకుంది. ఈ క్రమంలో మరో మహిళని తనకు పరిచయం చేయమని పూర్ణచంద్రరావు నాగుర్ బీని కోరాడు. శివకుమారి అనే మహిళను పరిచయం చేసింది. అతడు ఆమెతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో శివకుమారి అనే మహిళ నాగుర్ బీ, దాసరిబుజ్జి అనే వ్యక్తితో ఒంటరిగా గడిపేందుకు వెళ్ళిందంటూ శివకుమారి పూర్ణచంద్రరావు చెవులో వేసింది. దీంతో కోపద్రిక్తుడైన పూర్ణచంద్రరావు నాగుర్ బీ కి ఫోన్ చేసి నిలదీస్తుండగా నాగుర్ బీ భర్త షఫీ ఫోన్ లాక్కొని పూర్ణచంద్రరావుతో గొడవపడ్డాడు. తన భార్యపై పూర్ణచంద్రరావు విషప్రచారం చేస్తున్నాడని ద్వేషాన్ని పెంచుకున్న షఫీ అతణ్ణి ఎలాగైనా అంతం చేయాలని, దానికి సహకరించాలని కావటి రాజేష్, సాంబయ్య, జితేంద్ర అనే వ్యక్తులను ఆశ్రయించి, తాను మారణాయిధాలను సిద్దం చేస్తానని చెప్పాడు. అయితే హత్యకు ఒప్పుకోకుండా వారు కిడ్నాప్ చేయడానికి మాత్రమే అంగీకరించారు. ఇక లాభం లేదనుకున్న షఫీ పూర్ణచంద్రరావుని తానే స్వయంగా చంపుతానని అతణ్ని గుంటూరు పిలిపించాలని భార్య అయిన నాగుర్ బీని ఆదేశించాడు. అయితే పూర్ణచంద్రరావుకు రూ.లక్షలు ఇవ్వాల్సిన నాగుర్ బీ.. అవి అడుగుతున్నాడని కక్ష పెంచుకొని భర్త చెప్పినట్టు హత్యకు సహకరించకుండా.. తనకు తెలిసిన వ్యక్తులతో లక్ష రూపాయలు అడిగితే.. అంతు చూస్తామని మాత్రమే బెదిరించింది. ఈ క్రమంలో పూర్ణచంద్రరావుని చంపితేనే తనతో ఉంటానని షఫీ నాగుర్బీతో తేల్చి చెప్పి వెళ్ళిపోయాడు. దీంతో రూ.లక్షలు అడుగుతున్నాడని పూర్ణచంద్రరావుని అనుమానించి వెళ్ళాడని భర్త షఫీని వదిలించు కునేందుకు నాగుర్ బి కొత్త ఎత్తుగడ వేసింది. పూర్ణచంద్రరావుకి రూ.లక్షలు ఇస్తాని మరోసారి గుంటూరుకు పిలిపించి
కావటి రాజేష్, కరిముల్లా, బీబీ ఆసియాలతో కలిసి పూర్ణచంద్రరావుని కేబుల్ వైర్లు, చున్నీతో గొంతుబిగించి చంపేసింది. పూర్ణచంద్రరావు శవాన్ని అనంతవరప్పాడు, బొంతపాడు డొంకరోడ్డు వద్ద పంట కాలువల్లో పడేశారు. అయితే నాగుర్ బీ.. ఆడిన మైండ్ గేమ్ ఆడటం కొసమెరుపు. తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు మృతున్ని చుట్టి పడేసి, తనను అనుమానించి వెళ్ళిపోయిన భర్త షఫీ యొక్క ఆధార్ కార్డు, కరెంటు బిల్లు, ఓటర్ కార్డులను అందులో పెట్టి తెలివిగా తప్పించు కునేందుకు ప్రయత్నించింది. ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు తీగ లాగడంతో డొంక కదిలించారు. ప్రత్యక్షంగా హత్య కేసులో షఫీకి సంబంధం లేకపోయినా మొదటిసారి ప్రణాళిక వేసి మారణాయిధాలు సమకూర్చి ఇంట్లో పెట్టినందుకు అతణ్ణి కూడా కేసులో నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి బంగారు గొలుసు, 2 ఉంగరాలు, 1 ద్విచక్రవాహనం, 4 కత్తులు, ఒక తల్వార్ ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ఆర్.ఎన్ అమ్మిరెడ్డి వెల్లడించారు.